భోపాల్: ప్రేమ పెళ్లిని సహించని యువతి కుటుంబ సభ్యులు దారుణానికి పాల్పడ్డారు. యువ జంటను (Couple killed) తుపాకీతో కాల్చి చంపారు. ఆపై మృతదేహాలకు రాళ్లు కట్టి మొసళ్లున్న నదిలో పడేశారు. మధ్యప్రదేశ్లోని మోరేనా జిల్లాలో ఈ ఘోరం జరిగింది. 18 ఏళ్ల శివానీ తోమర్, 21 ఏళ్ల రాధేశ్యామ్ తోమర్ ప్రేమించుకున్నారు. మే 6న వారిద్దరూ తమ ఇళ్ల నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ వీడియో క్లిప్ను తమ కుటుంబాలకు పంపారు. తాము మేజర్లమని, ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. తాము సంతోషంగా ఉన్నామని, తమను ఇబ్బందులకు గురి చేయవద్దని తమ కుటుంబాలను ఆ వీడియోలో కోరారు.
కాగా, ఆ జంట మిస్సింగ్పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వారి కోసం వెతికారు. మే 11న ఆగ్రాలో వారు ఉన్నట్లు గుర్తించారు. అయితే తాము మేజర్లమని, తమ ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నట్లు శివానీ, రాధేశ్యామ్ పోలీసులకు తెలిపారు. అయినప్పటికీ ఆ జంట మాట వినని పోలీసులు వారి కుటుంబాలకు అప్పగించారు. అయితే ఆ యువ దంపతులు ఇటీవల కనిపించకుండా పోయారు. దీంతో యువకుడు రాధేశ్యామ్ తండ్రి ఈ నెల 4న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి తండ్రి రాజ్పాల్ తోమర్, ఆమె కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేశాడు. గతంలో వారు బెదిరించినట్లు చెప్పాడు.
మరోవైపు పోలీసులు యువతి తండ్రి, ఆమె కుటుంబాన్ని ప్రశ్నించగా అసలు గుట్టు విప్పారు. యువ దంపతులను హత్య చేసినట్లు అంగీకరించారు. ఒకే ఇంటి పేరు ఉండటంతో వారి పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. జూన్ 3న ఆ జంట తిరిగి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని తుపాకీతో కాల్చి చంపినట్లు చెప్పారు. అనంతరం ఇద్దరి మృతదేహాలకు రాళ్లు కట్టి మొసళ్లు ఉండే చంబల్ నదిలో పడేసినట్లు వెల్లడించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు యువతి తండ్రి రాజ్పాల్ తోమర్, మరో ఆరుగురు కుటుంబ సభ్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శివానీ, రాధేశ్యామ్ మృతదేహాల కోసం రాష్ట్ర విపత్తు రెస్పాన్స్ ఫోర్స్ బృందంతో చంబల్ నదిలో గాలిస్తున్నట్లు ఎస్పీ శైలేంద్ర చౌహాన్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.