Supreme Court : తమిళనాడు (Tamil Nadu) లో ప్రతిపక్ష పార్టీ డీఎంకే (DMK) పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) పర్యటనలు, ప్రసంగాలపై ఆంక్షలు విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. రాజకీయ విభేదాలను పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టును వేదికగా మార్చవద్దని స్పష్టంచేసింది. ఈ వ్యాఖ్యలతో డీఎంకే వెనక్కి తగ్గి తన పిటిషన్ను ఉపసంహరించుకుంది.
కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి విజయ్ జూలై 10న అక్కడ పర్యటించనున్నారని డీఎంకే కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. మృతుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు, ఆర్థిక సాయం అందించే కార్యక్రమం దర్యాప్తులో ఉన్న సాక్షులపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాదించింది. అంతేకాదు టీవీకే నేత ఆదవ్ అర్జున చేసిన వ్యాఖ్యలపైనా అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రసంగాలు, పర్యటనలపై ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ‘ముఖ్యమంత్రి ఏం చేయాలో కూడా సుప్రీంకోర్టే చెప్పాలా..? ఆయన ఈ కేసులో నిందితుడు కాదు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కుపైనా ఆంక్షలు కోరుతున్నారా..? రాజకీయ ప్రత్యర్థుల వ్యాఖ్యలపై ఈ కోర్టు ఎలా ఆదేశాలు ఇస్తుంది..?’ అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. దాంతో డీఎంకే తన పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి కోరగా కోర్టు అంగీకరించింది.
కాగా గత ఏడాది సెప్టెంబర్లో కరూర్లో విజయ్ ఎన్నికల ప్రచార సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. తొక్కిసలాటకు టీవీకే కార్యకర్తల నిర్లక్ష్యమే కారణమని డీఎంకే ఆరోపిస్తుండగా, ఇదంతా డీఎంకే రాజకీయ కుట్రేనని విజయ్, టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు.