న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఇవాళ రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. ప్రెసిడెంట్ ప్రసంగం ఓ పాలసీ డాక్యుమెంట్లా ఉందన్నారు. కానీ దాంట్లో పాలసీ కానీ విజన్ కానీ లేదన్నారు. 70 ఏళ్లలో ఏమీ జరగలేదని మీరంటున్నారు, కానీ ఏమీ జరగలేదంటే మీరంతా బ్రతికి ఉండేవారు కాదన్నారు. ప్రజాస్వామ్యం ఉన్నందు వల్లే ఇప్పుడు మీరు పాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని దేశ వ్యతిరేకులుగా చూస్తున్నట్లు ఆరోపించారు. విపక్షాలు తమ స్వరం వినిపించినప్పుడు.. మతం ప్రమాదంలో ఉందంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 9 లక్షల ఖాళీలు ఉన్నాయని, రైల్వేలో 15 శాతం, హోంశాఖలో 12 శాతం, డిఫెన్స్లో 40 శాతం ఉన్నట్లు ఆయన తెలిపారు. కానీ ఎస్సీలకు అవకాశాలు ఇవ్వడం లేదన్నారు.
దేశవ్యాప్తంగా 60 శాతం ఎంఎస్ఎంఈలను మూసివేసినట్లు ఖర్గే తెలిపారు. కోవిడ్ వేళ ఉద్యోగాలు కోల్పోయినవారిని మన్రేగా ఆదుకున్నట్లు చెప్పారు. కానీ మన్రేగా స్కీమ్కు చాలా తక్కువ నిధుల్ని కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. 150 రోజుల పనిదినాలకు బదులుగా కేవలం 20 రోజులకే పని కల్పించినట్లు ఆరోపించారు. గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ధరలు పెరిగినట్లు విమర్శించారు. మన భూమిని చైనా లాక్కుంటోందని, ఇండ్లు నిర్మిస్తోందని, మరెందుకు మీ కండ్లు ఎర్రపడడం లేదన్నారు. చైనా గురించి ఎందుకు మాట్లాడడంలేదన్నారు.
ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నట్లు ఖర్గే ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న సంస్థను ఎందుకు పబ్లిక్ లిస్టింగ్లో పెడుతున్నారని అడిగారు. ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో రైతుల ఆదాయం రెట్టింపు అంశం లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను ఎందుకు క్యాబినెట్ నుంచి తొలగించలేదన్నారు. పంట బీమా స్కీమ్లతో ఇన్సూరెన్స్ కంపెనీలు లాభపడినట్లు ఆయన ఆరోపించారు. మైనార్టీలను వేధిస్తున్నారని, మదర్ థెరిసా సంస్థను ఇబ్బందులకు గురి చేశారన్నారు. చర్చిలను ధ్వంసం చేస్తున్నారని, క్రైస్తవులను టార్గెట్ చేసినట్లు ఖర్గే ఆరోపించారు. ఈ అంశంపై ప్రధాని జోక్యం చేసుకోవాలన్నారు.