హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేక భావనను తొలిగించాల్సిన బాధ్యత యువ ఐపీఎస్లపై ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. మరో 25 ఏండ్లలో అంటే 100వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి భారత పోలీసు వ్యవస్థ ప్రపంచంలోనే అత్యాధునిక, పటిష్ఠమైన, ప్రభావవంతమైన ఫోర్స్గా నిలువాలని, భారత రాజ్యాంగ విలువలను కాపాడే శక్తిగా మారాలని ఆకాంక్షించారు. దీనికి యువ ఐపీఎస్లు నాయకత్వం వహించాలని సూచించారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 71, 72వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ ఆగస్టు 6న జరుగనున్నది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం వారితో ప్రత్యేకంగా ఆన్లైన్ సమావేశం నిర్వహించి, పలు అంశాలపై చర్చించారు. వారికి పలు సూచనలు చేశారు. ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ను శిక్షణ ఐపీఎస్లు ముందుండి నడిపించాలని కోరారు. దేశ ఔన్నత్యాన్ని పెంచేలా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై ఉన్న వ్యతిరేక భావన పెద్ద అడ్డంకిగా ఉన్నదని, దానిని తొలిగించి పోలీసులను వారి దృష్టిలో హీరోలుగా మార్చాలని కోరారు. కరోనా మహమ్మారి ప్రబలడం మొదలైనప్పుడు పోలీసులు సహాయం అందజేయడం చూసి ప్రజల అభిప్రాయంలో కొంతమార్పు వచ్చిందని, అయితే మళ్లీ పాత పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఐపీఎస్ల ప్రతి చర్యలో ‘ఎప్పుడూ దేశమే ముందు’ అన్న భావన ప్రతిఫలించాలని సూచించారు. విధులను సమర్థంగా నిర్వహించాలంటే మారుతున్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం ఎంతో కీలకమని చెప్పారు. సరిహద్దులకు అతీతంగా సాగుతున్న సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు పెరుగుతున్న తరుణంలో పోలీసులు విచారణలో శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని సూచించారు. పోలీసుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.