గౌహతి: పెట్రోల్, గ్యాస్ వంటి ఇంధన ధరల పెరుగుదలకు అసలు కారణం ఏమిటో అన్నది కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి వివరణ ఇచ్చారు. ప్రజలు కరోనా టీకాలను ఉచితంగా పొందుతున్నారని, దానికి డబ్బులు చెల్లించనందున పెట్రోల్ పన్నుల రూపంలో వాటిని సేకరిస్తున్నట్లు తెలిపారు. ఇంధన ధరలు ఎక్కువగా లేవన్న ఆయన అందులో పన్నులు కూడా కలిసి ఉన్నాయని చెప్పారు. ‘మీరు తప్పనిసరిగా ఉచితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. దీనికి డబ్బులు ఎక్కడ నుండి వస్తుంది? మీరు డబ్బు చెల్లించలేదు. అందుకే ఇలా సేకరిస్తున్నాం’ అని కేంద్ర మంత్రి తెలి వ్యాఖ్యానించారు. అస్సాంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ప్రజలు ఉచితంగా టీకా పొందుతున్నందునే వ్యాక్సిన్ల కొనుగోలు డబ్బులను పెట్రోల్ పన్నుల రూపంలో వసూలు చేస్తున్నట్లు తెలిపారు.