న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్, ఆధునిక వైద్యాన్ని హేళన చేస్తూ పతంజలి సంస్థ రిలీజ్ చేసిన యాడ్స్ విషయంలో బాబా రాందేవ్, బాలకృష్ణలు కోర్టు కేసు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం ముందు ఆ ఇద్దరూ హాజరయ్యారు. గత వారం కూడా హాజరైన ఆ ఇద్దరిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. యోగా గురించి మీరు ఎంతో మంచి చేశారని, దాని పట్ల మేం గౌరవం ఇస్తున్నామని బెంచ్ తెలిపింది. బహిరంగంగా క్షమాపణ చెప్పేందుకు తాము రెఢీగా ఉన్నామని ఆ ఇద్దరూ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రతిష్టను దిగజార్చడం తన ఉద్దేశం కాదు అని రాందేవ్ అన్నారు.
ఆ ఇద్దరి ప్రవర్తనను కోర్టు తప్పుపట్టింది. ఆయుర్వేద గొప్పతనం గురించి చెప్పేందుకు.. ఇతర వైద్య విధానాలను ఎందుకు తక్కువ చేశారని ధర్మాసనం అడిగింది. చట్టం అందరికీ ఒక్కటే అని జస్టిస్ అమానుల్లా పేర్కొన్నారు. దానిక బదులిస్తూ.. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటానని బాబా రాందేవ్ తెలిపారు. మిమ్మిల్ని క్షమిస్తామని మేం చెప్పడం లేదు, మీ గత చరిత్రను చూసి మీ పట్ల గుడ్డిగా ఉండలేమని, కానీ మీరు చెప్పిన క్షమాపణ గురించి ఆలోచిస్తామని, మీరేమీ అమాయకులు కాదు అని, కోర్టులో జరుగుతున్న పరిణామాల పట్ల మీకు తెలిసి ఉంటుందని జస్టిస్ కోహ్లీ అన్నారు. ఈ కేసు విచారణను ఏప్రిల్ 23వ తేదీకి వాయిదావేశారు.
#WATCH | Yog guru Baba Ramdev and Patanjali Ayurved’s Managing Director Acharya Balkrishna leave from Supreme Court. pic.twitter.com/8A2TeFaevd
— ANI (@ANI) April 16, 2024