లక్నో, ఆగస్టు 10: పేదల సంక్షేమం కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశానికి ప్రమాదకరమని ఇటీవల ప్రధాని మోదీ ప్రవచించారు. ఉచిత హామీలను తాయిలాల సంస్కృతిగా, గుజరాతీ పిల్లల మిఠాయి రేవడీతో పోల్చుతూ తూలనాడారు. రేవడిని ప్రోత్సహించేవారు ఎక్స్ప్రెస్వేలు, ఎయిర్పోర్టులు నిర్మించలేరని ఎద్దేవా చేశారు. అయితే, ఉచితాలను ఒకవైపు ప్రధాని వ్యతిరేకిస్తుండగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఉచిత వరాలు కురిపిస్తున్నారు. 60 ఏండ్లుపైబడిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు యోచిస్తున్నట్టు బుధవారం ప్రకటించారు.
మోదీపై యోగి తిరుగుబావుటా!
యోగి ప్రకటనను ఉటంకిస్తూ బీజేపీకి విపక్షాలు చురకలు అంటించాయి. మోదీ ఉచితాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ, యోగి తమ సర్కారు మోడల్ను అనుసరిస్తున్నారని ఆప్ ఎద్దేవా చేసింది. ఈ ప్రకటనను చూస్తే, మోదీపై యోగి తిరుగుబావుటా ఎగురవేసినట్టు కనిపిస్తున్నదని చురకలు వేసింది. లక్షల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన వారికే మోదీ ఉచితాలను ప్రకటిస్తారని వామపక్షాలు మండిపడ్డాయి. మరోవైపు, పన్నుచెల్లింపుదారుల డబ్బు ప్రజా సంక్షేమ పథకాలకు ఖర్చుచేయాలా? లేక కార్పొరేట్లకు కట్టబెట్టాలా? అనే దానిపై రెఫరెండమ్ నిర్వహించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.