UP CM Yogi Adityanath | ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. కొత్త క్యాబినెట్ కూర్పుపై ప్రధాని నరేంద్రమోదీతో యోగి ఆదిత్యనాథ్ చర్చిస్తారని తెలుస్తున్నది. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కూడా పాల్గొంటారని సమాచారం. ఈ భేటీలో కొత్త ప్రమాణ స్వీకార తేదీ కూడా ఖరారవుతుందని తెలుస్తోంది. న్యూ డిప్యూటీ సీఎంగా రానున్నారని భావిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రతన్దేవ్ సింగ్, మంత్రి సునీల్ బన్సాల్, బీజేపీ యూపీ ఇన్చార్జీ రాధామోహన్ సింగ్ కూడా యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఢిల్లీకి వెళతారు.
విద్యార్హతలు, కులం, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని బీజేపీ నాయకత్వం డిప్యూటీ సీఎంలు, మంత్రుల జాబితాను తయారు చేస్తున్నట్లు వినికిడి. ప్రతి సామాజిక వర్గానికి క్యాబినెట్లో చోటు దక్కుతుందని సమాచారం. దీనిపై బీజేపీ కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది. డిప్యూటీ సీఎం పదవికి స్వతంత్రదేవ్ సింగ్, బేబీ రాణి మౌర్య, బ్రిజేష్ పాఠక్, కేపీ మౌర్య పేర్లు విపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా స్వతంత్ర దేశ్ రాష్ట్ర రవాణా మంత్రిగా ఉన్నారు.
ఉత్తరాఖండ్ గవర్నర్గా ఉన్న బేబీ రాణి మౌర్య.. జాతవ్ సామాజిక వర్గ నేత. బ్రాహ్మణ సామాజిక వర్గ నేత బ్రిజేశ్ పాఠక్, కుర్మీ నేత స్వతంత్రదేవ్ సింగ్ తదితరులు యూపీలో బీజేపీ విజయంలో కీలకంగా వ్యవహరించారు. కేపీ మౌర్య సిరాథు స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. కానీ ఓబీసీ కోటాలో డిప్యూటీ సీఎంగా తీసుకుంటారని సమాచారం. ఇక ఇద్దరు మాజీ పోలీసు అధికారులను యోగి తన క్యాబినెట్లో చేర్చే అంశాన్ని బీజేపీ నాయకత్వం పరిశీలిస్తుందని వినికిడి.