బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో భారీ పేలుడు సంభవించింది. బెంగళూరు శివార్లలోని ఓ రసాయన పరిశ్రమలో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. బాయిలర్ యూనిట్లో సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాద సమయంలో అక్కడున్న ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. బెంగళూరు నగరంలో గురువారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించి ముగ్గురు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
‘తారగుపేటలో పంక్చర్ షాప్ పక్కన ఉన్న ట్రాన్స్పోర్టు గోడౌన్లో పేలుడు సంభవించింది. పంక్చర్షాపులో ఇద్దరుసహా మొత్తం ముగ్గురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు’ అని బెంగళూరు దక్షిణ డిప్యూటీ పోలీస్ కమిషనర్ హరీశ్పాండే తెలిపారు. పరిశ్రమ సరుకు అయిన హానికర రసాయనం కారణంగా పేలుడు సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్టు వెల్లడించారు. గోడౌన్లో ఇంకా హానికరమైన పేలుడు బాక్సులు 60 నిల్వ ఉన్నాయని, సిబ్బందిని, యాజమానిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. పేలుడు శబ్ధం రెండు కిలోమీటర్ల మేర వినిపించిందని స్థానిక ప్రజలు పేర్కొన్నారు.