ఒప్పుకున్న గెహ్లాట్ ప్రభుత్వం
జైపూర్: గతేడాది జూలైలో రాజస్థాన్లో రాజకీయ సంక్షోభ సమయంలో ‘ఫోన్ ట్యాపింగ్’ చేశామని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఒప్పుకున్నది. దీంతో సీఎం గెహ్లాట్పై బీజేపీ విరుచుకుపడింది. సీఎం పదవిని కాపాడుకునేందుకు అయన చట్టాలను ఉల్లఘించారని, అన్ని హద్దులు దాటారని ధ్వజమెత్తింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు, పలువురు రాజస్థాన్ కాంగ్రెస్ నేతలకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు లీకైన 8 నెలల తర్వాత ఫోన్ ట్యాపింగ్ జరగడం నిజమేనని గెహ్లాట్ ప్రభుత్వం ఇప్పుడు అంగీకరించింది. ఫోన్ ట్యాపింగ్పై గతేడాది ఆగస్టులో అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం తన సమాధానాన్ని ఇటీవల అసెంబ్లీ వెబ్సైట్లో పోస్టు చేసింది. అయితే ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలుపలేదు.