Yeddyurappa | కర్టాటక రాజకీయాలను మలుపు తిప్పిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భవిష్యత్లో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని, కోరిక కూడా లేదని ఆయన వెల్లడించారు. తన వయసు 80 దాటినందున పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పార్టీలో క్రియాశీలకంగా ఉండి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి నరేంద్ర మోదీని గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతానని తెలిపారు. అయితే, దీని వెనక తన కుమారుడికి వారసుడిగా పట్టాభిషేకం చేయాలన్న బలమైన ఒత్తిళ్లు కుటుంబం నుంచి వస్తున్నట్లు రాజకీయ నిపుణులు చెప్తున్నారు.
మరో నాలుగైదు నెలల్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పార్టీలో యడ్యూరప్ప ప్రాధాన్యం పెరుగుతూ వస్తున్నది. పార్టీ కేంద్ర పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న యడ్యూరప్పకు లింగాయత్ సామాజిక వర్గం మద్దతు ఉన్నది. రాష్ట్రంలో, పార్టీలో బలమైన నేతగా ఉన్నప్పుడే తన కుమారుడు బీవై విజయేంద్రను రాజకీయాల్లోకి తీసుకురావాలన్న కోరికతో యడ్యూరప్ప ఉన్నట్లుగా కనిపిస్తున్నది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న శికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయేంద్రను పోటీ చేయిస్తానని యెడ్డీ గతంలోనే ప్రకటించారు. దీనిపై పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని కూడా చెప్పారు.
యడ్యూరప్ప తొలిసారి 2007 నవంబర్ 12 న కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, కేవలం 7 రోజులకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం 2008 మే 30 న రెండోసారి ముఖ్యమంత్రయ్యారు. కానీ, తీవ్రమైన అవినీతి ఆరోపణల కారణంగా 2011 ఆగస్టు 4 న రాజీనామా చేశారు. 2018 మే 17 న మూడోసారి సీఎం పీఠం అధిష్ఠించిన యెడ్డీ.. 6 రోజులకే గద్దె దిగాల్సి వచ్చింది. 2019 జూలై 26 న నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి.. సరిగ్గా రెండేండ్ల తర్వాత రాజీనామా చేశారు. దాదాపు 100 అసెంబ్లీ స్థానాల్లో లింగాయత్లు ప్రభావం చూపించే స్థాయిలో ఉన్నందున ఆ వర్గం నుంచి వచ్చిన బీఎస్ యడ్యూరప్ప మాటలను బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో వినాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు.