న్యూఢిల్లీ : విద్వేష వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగానంద్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఢిల్లీలో ఆదివారం జరిగిన హిందూ మహాపంచాయత్లో ఆధ్యాత్మిక నేత యతి నర్సింగానంద్ మాట్లాడుతూ ముస్లిం నేత భారత ప్రధాని అయితే 50 శాతం హిందువులను మతం మార్చుతారని, 40 శాతం మందిని చంపేస్తారని, పదిశాతం హిందువులు దేశం విడిచి వెళ్లేలా చేస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు యతి నర్సింగానంద్పై పలు సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
డిసెంబర్ 2021లో హరిద్వార్లో జరిగిన ధర్మ సంసద్లో ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు ఆపై బెయిల్పై విడుదల చేశారు. ఇక ఆదివారం హిందూ మహాపంచాయత్లో ఆయన చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2029 లేదా 2034 లేదా 2039లో ముస్లిం దేశ ప్రధాని అవుతారని, ముస్లిం ప్రధాని కాగానే 50 శాతం హిందువులను మతం మార్చేస్తారని 40 శాతం మందిని చంపేస్తారని, మిగిలిన పది శాతం మంది శరణార్ధి శిబిరాల్లో తలదాచుకోవడం లేదా దేశం విడిచివెళతారని ఆయన ఈ వీడియోలో హెచ్చరించారు.
హిందూ మహాపంచాయత్కు సంబంధించి మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఓ ఎఫ్ఐఆర్ విద్వేష ప్రసంగానికి సంబంధించినది కాగా మరో రెండు ఎఫ్ఐఆర్లు జర్నలిస్టుల ఫిర్యాదులపై నమోదు చేశామని చెప్పారు. వేదిక వద్ద తమను వేధించారని జర్నలిస్టులు ఫిర్యాదు చేశారని, దీనికి సంబంధించి దర్యాప్తు చేపట్టామని ఇప్పటివరకూ ఎలాంటి అరెస్ట్లు జరగలేదని పోలీసులు తెలిపారు.