న్యూఢిల్లీ : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరు ఖరారైన సంగతి తెలిసిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 27న ఉదయం 11:30 గంటలకు యశ్వంత్ సిన్హా తన నామినేషన్ను దాఖలు చేయనున్నారు. యశ్వంత్ సిన్హాకు ఇప్పటి వరకు 22 పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తమ అభ్యర్థిని ఇవాళ రాత్రి వరకు ఖరారు చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరగనున్నాయి. 21న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
యశ్వంత్ సిన్హా 1960లో ఐఏఎస్ ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత 24 ఏండ్ల పాటు ఐఏఎస్ అధికారిగా కొనసాగి 1984లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం జనతా పార్టీలో చేరారు. 1988లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 1996లో బీజేపీ అధికార ప్రతినిధిగా, 1998, 1999, 2009లో హజారీబాగ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 1998లో చంద్రశేఖర్ కేబినెట్లో ఏడాది పాటు కేంద్ర ఆర్థిక మంత్రిగా కొనసాగారు. 2002లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా పని చేశారు. 2021, మార్చి 13న తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. మార్చి 15న టీఎంసీ వైస్ ప్రెసిడెంట్గా యశ్వంత్ సిన్హా నియమితులయ్యారు.