Yashwant Sinha | రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని, స్వతంత్రంగా ఉంటానన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఆయన తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనను ప్రతిపక్షాలు తమ రాష్ట్ర అభ్యర్థిగా బరిలో దింపాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపొందగా.. సోమవారం రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఎంసీ నాయకత్వంతో టచ్లో ఉన్నారా? అన్న ప్రశ్నకు.. యశ్వంత్ సిన్హా ‘ఎవరూ నాతో మాట్లాడలేదు. నేను ఎవరితోనూ మాట్లాడలేదు’ అన్నారు. ‘నేను (ప్రజాజీవితంలో) ఎలాంటి పాత్ర పోషిస్తానో.. ఎంత యాక్టివ్గా ఉంటానో చూడాలి. నాకు ఇప్పుడు 84 సంవత్సరాలు. ఇదే సమస్య. నేను ఎంతకాలం కొనసాగిస్తారో చూడాలి’ అన్నారు. బీజేపీని తీవ్రంగా విమర్శించే సిన్హా.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మార్చి 2021లో టీఎంసీలో చేరారు. 2018లో బీజేపీని వీడారు.