న్యూఢిల్లీ: మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీలో వరదలు పోటెత్తాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. యమునా నదిలో 206 మీటర్ల ప్రవాహ మట్టమే ప్రమాదకరం కాగా, ప్రస్తుతం ఆ నది 207.55 మీటర్ల స్థాయిలో పరుగులు తీస్తున్నది. గత 44 ఏళ్లలో యమునా నది ఇంత ఉధృతంగా ప్రవహించడం ఇదే తొలిసారి.
బుధవారం ఉదయం నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఉదయం 8 గంటల సమయంలో 207.25 మీటర్లకు చేరిన యమునా నది వరద.. మధ్యాహ్నం 12 గంటలకల్లా 207.48 మీటర్ల స్థాయికి పెరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు రికార్డు స్థాయిలో 207.55 కు చేరింది. 1978 తర్వాత యమునా నదికి ఇంత పెద్ద ఎత్తున వరద రావడం ఇదే తొలిసారి అని ఢిల్లీ వరద నియంత్రణ విభాగం చెబుతోంది.
1978లో యమునా నది వరద మట్టం 207.49 మీటర్ల స్థాయిని తాకింది. ఇప్పుడు ఆ రికార్డు కూడా బద్దలైంది. ఇంకా వరద ఉధృతి పెరుగుతూనే ఉండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీలో వరద పరిస్థితి, ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన చర్యలపై వారితో చర్చించారు.