న్యూఢిల్లీ: షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సుమారు రూ.5,551 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఆ కంపెనీ ఫోరెక్స్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలింది. స్మార్ట్ఫోన్ రంగంలో షియోమీ మేటి కంపెనీ. అయితే విదేశీ మారకంలో ఆ కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ కేసులో ఈడీ చర్యలకు దిగింది.
షియోమీ ఇండియా కంపెనీ.. చైనాకు చెందిన జియోమీ కంపెనీకి అనుబంధంగా నడుస్తోంది. 5000 కోట్లను ఆ కంపెనీ బ్యాంక్ అకౌంట్ల నుంచి సీజ్ చేశారు. ఫెమా చట్టం కింద ఆ డబ్బును సీజ్ చేసినట్లు ఈడీ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో షియోమీ కంపెనీ అక్రమ రీతిలో డబ్బులు చెల్లించినట్లు ఈడీ తన విచారణలో తేల్చింది. షియోమీ కంపెనీ ఇండియాలో 2014 నుంచి ఆపరేషన్స్ చేపట్టింది. ఇప్పటి వరకు ఆ కంపెనీ సుమారు 5,551 కోట్లను మూడు విదేశీ కంపెనీలకు మళ్లించినట్లు గుర్తించారు.