న్యూఢిల్లీ, ఆగస్టు 4: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం షియామీ.. భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఆధిపత్యం చూపిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్లో అమ్మకాలు గతంతో పోల్చితే 22 శాతం క్షీణించినప్పటికీ.. మొత్తం అమ్మకాల్లో 20 శాతం వాటా షియామీదే. ఈ మేరకు గురువారం సైబర్ మీడియా రిసెర్చ్ (సీఎంఆర్) నివేదిక తెలిపింది. 18 శాతం వాటాతో సామ్సంగ్ రెండో స్థానంలో ఉన్నది. అయితే 5జీ ఫోన్ల విభాగంలో మాత్రం సామ్సంగ్దే అగ్రస్థానం. 28 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నది.
ఇదిలావుంటే జనవరి-మార్చితో పోల్చితే ఏప్రిల్-జూన్లో 5జీ మొబైల్స్ దిగుమతులు 7 శాతం పెరిగాయి. ఇక నిరుడుతో చూస్తే ఏకంగా 163 శాతం వృద్ధిరేటు కనిపించింది. కాగా, సూపర్ ప్రీమియం (ధరల శ్రేణి రూ.50వేలు-లక్ష) మొబైల్స్లో యాపిల్ దూసుకుపోతున్నది. 78 శాతం వాటా దీనిదే. ఐఫోన్ 12, 13 సిరీస్ కలిసొచ్చింది. అలాగే ఐఫోన్ దిగుమతులూ ఈ ఏప్రిల్-జూన్లో పెరిగాయని తేలింది. దేశంలోకి ఈ ఏడాది మొత్తం స్మార్ట్ఫోన్ దిగుమతులు 174 మిలియన్ల మార్కును తాకుతాయని ఈ సందర్భంగా సీఎంఆర్ నివేదిక అంచనా వేస్తున్నది.