న్యూఢిల్లీ: ఒకప్పుడు పిల్లలు ఏడిస్తే వారిని ఊరుకుంచడానికి ఆట బొమ్మలు ఇచ్చేవారు..! అయినా వినకపోతే కుక్కనో, పిల్లినో, బర్రెనో, కోడినో చూపించేవారు..! అయినా పనికాకపోతే లాలి పాటలు, జోల పాటలు పాడేవారు..! కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది..! పిల్లల ఏడుపు ఆపడానికి తల్లిదండ్రులు ప్రయోగించే ఏకైక ఆయుధం స్మార్ట్ ఫోన్..! బిడ్డలు మారాం చేస్తే చాలు వాళ్ల చేతికి సెల్ఫోన్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు..! కానీ చిన్న వయసులోనే పిల్లల చేతికి స్మార్ట్ఫోన్లు ఇవ్వొద్దని జియోమీ ఇండియా మాజీ సీఈవో మనుకుమార్ జైన్ చెబుతున్నారు. చిన్న వయసులో స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రమాదకరం అంటున్నారు.
పిల్లలకు చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్లు ఇవ్వడంవల్ల పెరిగి పెద్దయ్యాక వాళ్లు మానసిక సమస్యలను ఎదుర్కొంటారని సేపియన్ ల్యాబ్స్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇటీవల చేసిన అధ్యయనంలో తేలింది. ఇప్పుడు అదే పరిశోధనను ఉటంకిస్తూ కుమార్ జైన్ పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వొద్దని చెప్పారు. చిన్న వయసులో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లతో గడపడంవల్ల వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అందువల్ల పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్లు ఇవ్వొద్దని పేరెంట్స్ను హెచ్చరించారు.
సేపియన్ ల్యాబ్స్ అధ్యయనం ప్రకారం.. పదేళ్లలోపు వయసులోనే స్మార్ట్ ఫోన్ల వాడకం మొదలుపెట్టిన మహిళల్లో 60 నుంచి 70 శాతం మంది మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అదే 18 ఏళ్లు నిండిన తర్వాత స్మార్ట్ ఫోన్ల వాడకం మొదలుపెట్టిన మహిళల్లో కేవలం 46 శాతం మంది మాత్రమే మానసిక సమస్యలను అనుభవిస్తున్నారని జైన్ చెప్పారు. అదేవిధంగా పదేళ్లలోపు వయసులో స్మార్ట్ఫోన్ల వాడకం మొదలుపెట్టిన పురుషుల్లో కూడా 45 నుంచి 50 శాతం మంది మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పిల్లలు ఏడుస్తున్నారనో.. ఏదైనా తింటున్నప్పుడు, కారులో తీసుకెళ్తున్నప్పుడు చెప్పినమాట వినకుండా మారాం చేస్తున్నారనో.. పేరెంట్స్ స్మార్ట్ ఫోన్లతో ప్రలోభ పెట్టడం మంచి పద్ధతి కాదంటున్నారు మనుకుమార్ జైన్. తల్లిదండ్రులు అలాంటి పనులు మానుకోవాలని ఆయన లింక్డ్ ఇన్లో కోరారు. అందుకు బదులుగా ప్రాపంచిక విషయాలు తెలియజేయాలని, అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్లి బయటి ప్రపంచాన్ని చూపించాలని, వారికి ఇష్టమైన ఆటలు, పనులు చేయడాన్ని ప్రోత్సహించాలని, దానిద్వారా వారి ఆరోగ్యకరమైన జీవితానికి దోహదపడిన వాళ్లము అవుతామని జైన్ పేర్కొన్నారు.
పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని, వారి బాల్యం ఎంతో విలువైనదని, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం సాధ్యమైనంత ఉత్తమ పునాది వేయడం పెద్దవాళ్ల కర్తవ్యమని మనుకుమార్ జైన్ సూచించారు. వాస్తవానికి తాను స్మార్ట్ ఫోన్లకు, ట్యాబ్లెట్లకు వ్యతిరేకం కాదని, కానీ, లేత వయసులో పిల్లల మెదళ్లకు ప్రమాదం తలపెట్టకూడదన్నదే తన ఉద్దేశమని, అందుకే చిన్నపిల్లల పేరెంట్స్ తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్లను దూరం పెట్టాలని కోరుతున్నానని ఆయన చెప్పారు.