న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకం పారదర్శకంగా లేదని పేర్కొనడం సరికాదని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. రానున్న రోజుల్లో జడ్జిల నియామకం మరింత పారదర్శకంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన దివంగత రామ్ జఠ్మలానీ స్మారక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలుగా నియమితులయ్యేందుకు అర్హత ఉన్నవారిని గుర్తించేందుకు కసరత్తు జరుగుతున్నది. జడ్జిలు వెలువరించిన తీర్పుల డాటా ఆధారంగా నియామకాల మదింపు ఉంటుంది’ అని తెలిపారు. సుప్రీంకోర్టు సామాన్యుల కేసులను విచారించడం లేదన్న వాదనలను ఆయన కొట్టివేశారు. ఆర్టికల్ 370 రద్దుపై కశ్మీర్కు చెందిన సామాన్యుల గొంతుకను వింటున్నట్టు చెప్పారు.