లక్నో: బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేశారు. ఆ పదవి నుంచి ఆయన తప్పుకోవాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసన చేశారు. అయితే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగే రెజ్లింగ్ ఫెడరేషన్ జనరల్ బాడీ సమావేశంలో దీనిపై చర్చిస్తామని ఆయన చెప్పారు. కాగా, అగ్రశ్రేణి రెజ్లర్ల నిరసనలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. నిరసనకు దిగిన అగ్రశ్రేణి రెజ్లర్లతో క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ పలు దఫాలుగా చర్చలు జరిపారు. బ్రిజ్ భూషణ్పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతోపాటు పర్యవేక్షణ కమిటీని నియమించారు. దీంతో రెజ్లర్లు తమ నిరసనను విరమించారు.
మరోవైపు పర్యవేక్షణ కమిటీని నియమించిన నేపథ్యంలో అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని రెజ్లింగ్ ఫెడరేషన్ను క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఫెడరేషన్ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ను కూడా కేంద్రం సస్పెండ్ చేసింది. దీంతో రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష బాధ్యతల నుంచి బ్రిజ్ భూషణ్ తాత్కాలికంగా తప్పుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఆదివారం జరుగాల్సిన రెజ్లింగ్ ఫెడరేషన్ జనరల్ బాడీ సమావేశం రద్దైంది. అలాగే యూపీలోని గోండాలో ఆదివారం జరగాల్సిన రెజ్లింగ్ ఫెడరేషన్ అత్యవసర సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని కూడా రద్దు చేశారు.