న్యూఢిల్లీ, మే 26: లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నెల రోజులుగా పోరాటం చేస్తున్న రెజ్లర్లకు అనూహ్య స్పందన లభిస్తున్నది. వారికి మద్దతు తెలిపేందుకు వివిధ రాష్ర్టాల నుంచి మహిళా సంఘాల నేతలు తరలి వస్తున్నారు. ఆశా వర్కర్ల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు, మహిళా రైతుల నుంచి సాధారణ ఉద్యోగుల వరకు అన్ని వర్గాల నుంచి రెజ్లర్ల పోరాటానికి మద్దతు లభిస్తున్నది. ఈ నెల 28న కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని ప్రారంభించనుండగా, అదే రోజు ఆ భవనం ముందే మహిళా మహా పంచాయత్ నిర్వహిస్తామని వినేశ్ ఫోగట్ ప్రకటించారు.
ఓ మైనర్ సహా 7 మంది మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బ్రిజ్భూషణ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన దాష్టీకాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ క్రీడాకారులు పోరాటం మొదలుపెట్టినా ఢిల్లీ పోలీసులు మొదట కనీసం పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు జోక్యంతో ఎట్టకేలకు ఆయనపై రెండు ఎఫ్ఐఆర్లు దాఖలు చేసి వదిలేశారు. అధికార యంత్రాంగం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్న రెజ్లర్లు.. బ్రిజ్భూషణ్ను అరెస్టు చేసేవరకు ఒక్క అడుగు కూడా వెనక్కు తగ్గేది లేదని, జంతర్మంతర్ను వదిలి వెళ్లేది లేదని తెగేసి చెప్తున్నారు. కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి ఢిల్లీ పోలీసులు రెజ్లర్లపై దాడిచేయటం కలకలం సృష్టించింది. అయినా, వారు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ‘బంగారు పతకాలు సాధించినప్పుడు వారికి ప్రధానమంత్రి స్వయంగా స్వాగతం పలికారు. ఇప్పుడు న్యాయం కోసం పోరాటం చేస్తుంటే ఒక్కరు కూడా పట్టించుకోవటంలేదు’ అని మహిళా సాంస్కృతిక్ సంఘటన్ నాయకురాలు జోలీ సర్కార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రెజ్లర్ల పోరాటంపై సామాన్యుల్లో అవగాహన కల్పించేందుకు దేశ రాజధాని ఢిల్లీ నలుమూలలా ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నామని నగరానికి చెందిన ఆశా వర్కర్స్ అసోసియేషన్ నాయకురాలు ప్రకాశ్దేవి మీడియాకు తెలిపారు.