లక్నో: దుండగులు జరిపిన కాల్పుల్లో గాయపడిన భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ను రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా కలిశారు (Wrestlers meet Chandrashekhar Azad). ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించారు. దళిత హక్కులు, వారి అభ్యున్నతి కోసం పోరాడుతున్న చంద్రశేఖర్ ఆజాద్పై కాల్పులు జరిపి హత్యకు ప్రయత్నించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిజం కోసం పోరాడుతున్న వారిపై దాడులు జరుగుతున్నాయని బజరంగ్ పునియా ఆరోపించారు. ఆయనపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలన్నది తమ డిమాండ్ అని అన్నారు.
కాగా, చంద్రశేఖర్ ఆజాద్ కేవలం ఒక వర్గానికే నేత కాదని, మొత్తం సమాజానికి నేత అని బజరంగ్ పునియా తెలిపారు. నిజం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికి ఆయన మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. రైతుల ఉద్యమంతోపాటు రెజ్లర్ల నిరసనకు ఆయన మద్దతు ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిపై దుండగులు గన్తో కాల్పులు జరిపిన సంగతి తెలిసిందని, దీంతో ఆయనను కలిసి పరామర్శించేందుకు తాము ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కూడా చంద్రశేఖర్ ఆజాద్పై జరిగిన కాల్పులను ఖండించారు. ఈ సంఘటన సిగ్గుచేటని అన్నారు. నిందితులను పోలీసులు వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో సహారన్పూర్ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఒక కారులో వచ్చిన దుండగులు ఎస్యూవీలో ప్రయాణిస్తున్న ఆయనపై దేవబంద్ ప్రాంతంలో కాల్పులు జరిపి పారిపోయారు. ఒక బుల్లెట్ ఆయన కడుపులోకి దూసుకెళ్లింది. చంద్రశేఖర్ ఆజాద్ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స తర్వాత సహారన్పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి అక్కడ అడ్మిట్ చేశారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు వినియోగించిన కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది.