Wrestlers protest | న్యూఢిల్లీ, జూన్ 6: కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీలను నమ్మలేమని, ఆయన్ను విశ్వసించి ఆందోళనలను విరమించబోమని ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియా స్పష్టం చేశారు. అమిత్ షా గతంలోనూ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్పై చర్యలు చేపడతామని తమకు హామీ ఇచ్చి మాట తప్పినట్టు ఆయన విమర్శించారు. ప్రభుత్వంతో తాము ఎలాంటి డీల్ కుదుర్చుకోలేదని స్పష్టం చేశారు. షాతో శనివారం జరిగిన భేటీ తర్వాత రెజ్లర్లు ఆందోళనలపై వెనక్కి తగ్గారని వస్తున్న వదంతులపై తాజాగా బజరంగ్ పునియా స్పందించారు. మంగళవారం ఆయన మాట్లాడారు. అమిత్ షాతో డీల్ కుదిరిందని, అందుకే ఆందోళనలను విరమించినట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
అటువైపు నుంచే లీక్…
శనివారం రాత్రి జరిగిన భేటీ గురించి ఎవరితోనూ చర్చించవద్దని అమిత్ షా తమతో చెప్పినట్టు పునియా తెలిపారు. కానీ ఆ విషయం అటువైపు నుంచే లీక్ అయిందని పేర్కొన్నారు. లైంగిక వేధింపులపై నిష్పక్షపాతమైన విచారణ జరగాలని తాము అమిత్ షాను కోరామని తెలిపారు. గతంలోనూ షా హామీలు ఇచ్చి మోసం చేసినట్టు గుర్తు చేశారు. ఆందోళనలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై వ్యూహరచన చేసినట్టు వెల్లడించారు.
డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదు…
తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదని ఆయన వివరించారు. ‘న్యాయస్థానాల ముందు అందరూ సమానులే. బ్రిజ్భూషణ్పై చర్యల గురించి చర్చలు జరుగుతున్నాయి’ అని అమిత్ షా తమతో చెప్పినట్టు పునియా వెల్లడించారు.
గౌరవ, మర్యాదల కోసం జరుగుతున్న పోరాటం…
జంతర్మంతర్లో తమ దీక్షా శిబిరాలను తొలగించాక తమ ఉద్యోగాల్లో భాగంగా విధులకు హాజరైనట్టు చెప్పారు. దీంతో తాము ఆందోళనలను విరమిస్తున్నట్టు వదంతులు వ్యాపించాయని పేర్కొన్నారు. గౌరవ, మర్యాదల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో అవసరమైతే తమ ఉద్యోగాలను కూడా వదులుకుంటామన్నారు. అమిత్ షాతో భేటీ తర్వాత రెజ్లర్లు వెనక్కి తగ్గినట్టు వార్తలు వచ్చాయి. బీజేపీతో డీల్ కుదరడంతోనే రెజ్లర్లు విధులకు హాజరైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బ్రిజ్భూషణ్ ఇంటికి పోలీసులు
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రెజ్లర్ల భేటీ జరిగిన తర్వాత రెజ్లర్ల ఆందోళనలకు సంబంధించి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ ఇంటికి మంగళవారం ఢిల్లీ పోలీసులు వెళ్లారు. ఉత్తరప్రదేశ్లోని గోండాలోని ఇంట్లో ఆయన లేకపోవడంతో డ్రైవర్, పనివారిని పోలీసులు విచారణ చేశారు. వారి స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్నారు. ఐడీలను తనిఖీ చేసి, అడ్రస్లను నమోదు చేసుకున్నారు. సాక్ష్యాలను సేకరించి వాటిని బాధితుల వాంగ్మూలంతో పోల్చి చూస్తున్నామని పోలీసులు తెలిపారు. సాక్ష్యాధారాల సేకరణ పూర్తయిన వెంటనే కోర్టులో రిపోర్టు సమర్పిస్తామని చెప్పారు.