హైదరాబాద్: ఇక నుంచి ముస్లింలు ఒక్క మసీదును కూడా హిందువుల కోసం వదులుకోరు అని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) అన్నారు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసును దృష్టిలో పెట్టుకుని అసద్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రాష్ట్రపతి భవన్ను రేపటి నుంచి తొవ్వడం ప్రారంభిస్తే, దాని కింద ఏదో ఒకటి దొరుకుతుందని, జ్ఞానవాపిలో వందల ఏండ్ల నుంచి నమాజ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. బాబ్రీ మసీదు కేసుతో పోలిస్తే జ్ఞానవాపి వివాదం భిన్నమైందన్నారు. అయోధ్యలో రామమందిరం ఉన్న వద్ద గతంలో ముస్లింలు ప్రార్థనలు చేయలేదన్నారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జ్ఞానవాపి కేసులో న్యాయ పోరాటం చేస్తామని, ఈ కేసు ఎన్నటికీ ముగిసిపోదన్నారు. తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు, టైటిళ్లను కోర్టుకు అందజేస్తామన్నారు. ప్రధాని మోదీపై భారతీయ ముస్లింలు విశ్వాసం కోల్పోయినట్లు చెప్పారు. ఒకే ఒక్క ఐడియాలజీ కోసం ప్రధాని మోదీ తన రాజ్యాంగ విధుల్ని వినియోగిస్తున్నారని ఆరోపించారు.