డబుల్ ఇంజిన్ సర్కార్ బీహార్ రోడ్ల పరిస్థితి ఇది
నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో
బీహార్ రోడ్లు జంగిల్ రాజ్ను గుర్తుకు తెస్తున్నది
ఆ రాష్ట్ర సీఎం నితీశ్కుమార్కు పీకే చురకలు
పట్నా, జూన్ 23: డబుల్ ఇంజిన్ సర్కారుతో బీహార్లో రోడ్లు బాగా అభివృద్ధి చెందాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకొంటున్న క్రమంలో.. ఓ ఆసక్తికర వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నది. ఆ రాష్ట్రంలోని మధుబని జిల్లా జాతీయ రహదారి 227పై 20 కిలోమీటర్ల మేర విస్తరించిన 100 భారీ గుంతల వీడియో అది. వాటిని చూస్తుంటే రోడ్లపైనే చిన్నపాటి కుంటలు వెలిశాయా? అన్నట్టు కనిపిస్తున్నది.
డబుల్ ఇంజిన్ సర్కారులో రోడ్ల పరిస్థితి ఇదీ! అని నెటిజన్లు ఎన్డీయే సర్కారును ఎద్దేవా చేస్తున్నారు. ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్, మిత్ర పక్షం బీజేపీపై తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, బీహార్ రోడ్లు 1990ల నాటి జంగిల్ రాజ్ పాలనను గుర్తు తెస్తున్నాయని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ ప్రచార కన్వీనర్ ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ను టార్గెట్ చేస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న పీకే.. మాధురి జిల్లా జాతీయ రహదారి ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ, ‘జంగిల్ రాజ్ ఆఫ్ 1990స్’ అని కామెంట్ చేశారు. 1990ల్లో బీహార్లో లాలూప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవి రాష్ర్టాన్ని పాలించారు. ఆ తర్వాత 2005లో నితీశ్ అధికారంలోకి వచ్చారు. అయినా.. అప్పటి, ఇప్పటి పాలనలో పెద్దగా తేడా లేదని గుర్తు చేసేలా పీకే ఈ ట్వీట్ చేశారు.