న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో.. నగరంలోని ప్రైవేటు ఆఫీసులను మూసివేయాలని నిర్ణయించారు. ప్రైవేటు ఆఫీసు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసలుబాటు కల్పించాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(డీడీఎంఏ) తన ఆదేశాల్లో పేర్కొన్నది. మినహాయింపు ఉన్న కంపెనీలు తప్ప మిగితా అన్ని కంపెనీల్లోనూ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వీలును కల్పించారు. అన్ని రెస్టారెంట్లను, బార్లను మూసివేస్తున్నట్లు డీడీఎంఏ తన ప్రకటనలో వెల్లడించింది. కేవలం టేకవేలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
2 రోజుల్లో తారా స్థాయికి..
ఢిల్లీలో మరో ఒకటి లేదా రెండు రోజుల్లో కోవిడ్ కేసులు తారా స్థాయికి చేరున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. నిన్న ఒక్క రోజే ఆ రాష్ట్రంలో 19 వేల కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం ఆ రాష్ట్రంలో 22 వేలు నమోదు అయిన విషయం తెలిసిందే.
వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి మినహాయింపు వీటికి కల్పించారు. ప్రైవేటు బ్యాంకులు, అత్యవసర సేవలు నిర్వహించే కంపెనీలు, ఇన్సూరెన్స్ సంస్థలు, ఫార్మా కంపెనీలు, రిజర్వ్ బ్యాంక్తో లింకున్న సంస్థలు, ఎన్బీఎఫ్సీ, మైక్రోఫైనాన్స్ సంస్థలు, కొరియర్ సేవలు, లాయర్లకు మినహాయింపు ఇచ్చారు.