సిమ్లా: బీజేపీ మాదిరిగా సంస్థలు, ప్రాజెక్టుల పేర్లను తాము మార్చబోమని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. రోహ్తంగ్ పాస్ కింద నిర్మించిన అటల్ టన్నెల్ పేరును తమ ప్రభుత్వం మార్చబోదని స్పష్టం చేశారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మార్చుతామని ఆయన వెల్లడించారు. 2010 జూన్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ టన్నెల్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన సంగతిని గుర్తు చేశారు. అయితే 2020 అక్టోబర్లో అటల్ టన్నెల్ను ప్రధాని మోదీ ప్రారంభించిన సందర్భంగా నాటి శిలాఫలకాన్ని బీజేపీ ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో అటల్ టన్నెల్ వద్ద కొత్తగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తామని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ తెలిపారు. నాడు శంకుస్థాపన చేసిన సోనియా గాంధీ పేరును కొత్త శిలాఫలకంలో చేర్చుతామని వెల్లడించారు. మాజీ ప్రధాని అటల్ వాజ్పేయిని తాము గౌరవిస్తామని, అందుకే ఆయన పేరుతో ఉన్న టన్నెల్ పేరును తమ ప్రభుత్వం మార్చబోదని స్పష్టం చేశారు.
కాగా, హిమాచల్ ప్రదేశ్కు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అటల్ టన్నెల్ పేరు మార్పుపై ఊహాగానాలు వెలువడ్డాయి.