Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా టీఎంసీ అధినేత, సీఎం మమతా బెనర్జీ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రజలు చేపలు, గుడ్లు తినలేరని వ్యాఖ్యానించారు. పురులియాలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు చేపలు తినడం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలు చేపలు, మాంసం, గుడ్లు తినలేరు. మీరందరూ మీ మతాల్ని అనుసరిస్తారు. కానీ, బీజేపీ వాళ్లంతా ఒకేవైపు ఉంటారు. ఇతర మతాల మీద వారికి నమ్మకం లేదు. ధర్మం అంటే మానవత్వం అని శ్రీకృష్ణుడు చెప్పాడు. పని చేయడం ధర్మం. మంచి కోసం పని చేయడమే ధర్మం. కానీ, అల్లర్లు చేయడం, అమాయకుల్ని చంపడం ద్వారా బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోంది. అందులోనూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గిరిజనులు, మహిళలపైనే అధిక దాడులు జరుగుతున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలోనే దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. పని కోసం వేరే ప్రాంతాలకు వెళ్లి బెంగాలీ మాట్లాడేవారిపై ఇతర రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్నాయి. కానీ, మేం ఎవరినీ అణచివేయం. టీఎంసీ అంటే శాంతి, మానవత్వం, అందరినీ గౌరవించడం.
ప్రజలతో కలిసి పని చేయడం’’ అని మమత వ్యాఖ్యానించారు. బెంగాల్ను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే బీజేపీ కేంద్రంలో అధికారం కోల్పోతుందని ఆమె అంతకుముందు అన్నారు. బెంగాల్లో నాలుగోసారి వరుసగా అధికారం చేపడితే, అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీని ఆక్రమిస్తామని మమత హెచ్చరించారు. బీజేపీ బెంగాల్లో అధికారంలోకి వస్తే వాళ్లు ఇక్కడ బుల్డోజర్లు వాడుతారని విమర్శించింది. ఎన్నికల సంఘం కూడా బీజేపీ కోసమే పని చేస్తుందని మమత ఆరోపించింది. వచ్చే నెలలో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.