న్యూఢిల్టీ: మహిళా హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన ప్రముఖ ఉద్యమకారిణి, కవయిత్రి , రచయిత్రి అయిన కమ్లా భాసిన్ (75) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె.. ఈ తెల్లవారుజామున (శనివారం) మూడు గంటలకు ఢిల్లీలోని సిటీ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మరో మహిళా హక్కుల ఉద్యమకారిణి కవితా శ్రీవాస్తవ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కమ్లా భాసిన్ మృతి దేశంలో, దక్షిణాసియాలో మహిళా హక్కుల ఉద్యమానికి తీరనిలోటని కవితా శ్రీవాస్తవ పేర్కొన్నారు.
కాగా, కమ్లా భాసిన్ మృతికి పలువురు ప్రముఖులతో లక్షల మంది ఇంటర్నెట్ ద్వారా సంతాపాలు తెలియజేస్తున్నారు. కమ్లా భాసిన్ మృతికి సంతాపం తెలిపిన ప్రముఖుల్లో సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, సోషల్ యాక్టివిస్ట్ హర్ష్ మందేర్, కాంగ్రెస్ కీలక నాయకుడు శశిథరూర్, ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ తదితరులు ఉన్నారు.