న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్నిగా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరికి జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) గురువారం నోటీస్ జారీ చేసింది. కమిషన్ ఎదుట హాజరై తన వ్యాఖ్యలపై రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఎన్సీడబ్ల్యూ ఎంపీని కోరింది. ఆగస్ట్ 3న ఉదయం 11.30 గంటలకు హాజరు కావాలని మహిళా కమిసన్ సీనియర్ కాంగ్రెస్ నేతకు స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేసిన అధిర్ రంజన్పై తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి సైతం మహిళా కమిషన్ లేఖ రాసింది. ఎంపీ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎన్సీడబ్ల్యూ సహా 13 రాష్ట్రాల మహిళా కమిషన్లు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు అవమానకరంగా, కించపరిచేలా ఉన్నాయని అభివర్ణించాయి.
తాను నోరు జారి పొరపాటున ఆ వ్యాఖ్యలు చేశానని, తాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణ చెబుతానని బీజేపీ నేతలకు కాదని అధిర్ రంజన్ చౌధరి వివరణ ఇచ్చారు. అంతకుముందు పార్లమెంట్లో అధిర్ రంజన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు విరుచుకుపడ్డారు. అధిర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని కాషాయ పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు.