న్యూఢిల్లీ : ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధినుల భద్రతపై మహిళా కమిషన్ నియమించిన కమిటీ సభ్యుల పర్యటనలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో కమిషన్ ప్యానెల్ పర్యటించగా ఆయా స్కూల్ ఆవరణలో వాడిపారేసిన సిరంజిలు, మద్యం బాటిళ్లు, డ్రగ్స్ పడేసి ఉండటం కలకలం రేపింది.
ఎంసీడీ స్కూళ్లలో విద్యార్ధినులపై ఇటీవల వెలుగుచూసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపధ్యంలో ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ఆయా స్కూళ్లలో పరిస్ధితులపై దర్యాప్తునకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యుల పర్యటనలో దయనీయమైన పరిస్ధితులు వెలుగుచూశాయి. డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్, సభ్యులు ప్రమీలా గుప్తా, సారికా చౌధురి, ఫిర్దోస్ ఖాన్, వందనా సింగ్లు పలు స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
స్కూళ్లలో పరిస్ధితి అత్యంత దయనీయంగా, అభద్రతా వాతావరణంతో ఉందని కమిటీ పేర్కొంది. స్కూల్స్ వద్ద గేట్లు తెరిచి ఉన్నాయని, సెక్యూరిటీ గార్డులు ఎక్కడా కనిపించలేదని గుర్తించారు. కొన్ని స్కూళ్లలో మందుబాబులు లోపలికి చొచ్చుకువచ్చి అధికారులనే బెదిరిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. స్కూల్ ఆవరణలో డ్రగ్స్, సిగరెట్ బాక్సులు, సిరంజిలు, గుట్కా కవర్లు, పగిలిన మద్యం సీసాలు కనిపించడం దిగ్భ్రాంతి కలిగించిదని కమిటీ పేర్కొంది. శిధిలావస్ధలో ఉన్న భవనాల్లోనూ విద్యార్ధులకు పాఆలు చెబుతున్నారని గుర్తించింది.