న్యూఢిల్లీ, మే 9: లైంగిక వేధింపులకు సంబంధించి మహిళా రెజ్లర్ల ఆరోపణలపై ఢిల్లీ పోలీసుల తీరును ఢిల్లీ మహిళా కమిషన్ తప్పుబట్టింది. లైంగిక వేధింపుల కేసులో నిందితుల్ని అరెస్టు చేయటంలో ఎందుకు విఫలమయ్యారని న్యూఢిల్లీ జిల్లా డీఎస్పీకి మహిళా కమిషన్ మంగళవారం సమన్లు జారీచేసింది. నిందితుల్లో ఏ ఒక్కరినీ పోలీసులు అరెస్టు చేయలేదన్న సంగతి కమిషన్ దృష్టికి వచ్చిందని, దీనిపై వివరణ ఇచ్చేందుకు మే 12న మహిళా కమిషన్ ప్యానెల్ ముందు హాజరుకావాలని డీఎస్పీని ఆదేశించింది.
‘ఎఫ్ఐఆర్ రిజిస్టరై 10 రోజులు దాటుతున్నా, బాధితులెవ్వరి నుంచీ వాంగ్మూలం నమోదుచేయలేదు’ అంటూ కమిషన్ పేర్కొంది. న్యూఢిల్లీ జిల్లా డీఎస్పీ నుంచి వివరణ కోరింది. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషన్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా మహిళా రెజ్లర్లు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే.