CM Vijay : తమిళనాడులో కీలక పథకాల అమలుపై సీఎం విజయ్ దృష్టిపెట్టారు. త్వరలోనే కళైంగర్ ఉరిమయ్ తోగాయ్ పథకం అమలుపై కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.1,000 వారి అకౌంట్లలో జమ చేస్తామన్నారు. మే నెలకు సంబంధించిన డబ్బులు అతి త్వరలోనే లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు.
అలాగే, ప్రతినెలా డబ్బులు మహిళలకు సమయానికే అందేలా చూస్తామని చెప్పారు. ఈ పథకాన్ని గత డీఎంకే ప్రభుత్వం ప్రారంభించింది. మాజీ సీఎం, స్టాలిన్ తండ్రి కరుణానిధి పేరు మీద అప్పటి ప్రభుత్వం మహిళల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని విజయ్ కూడా అమలు చేస్తున్నారు. అయితే, ఈ పథకాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు తమ ప్రభుత్వానికి కొంత సమయం కావాలన్నారు. అయితే, విజయ్ తాజా ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా 60 ఏళ్లలోపు ఉన్న పేద, అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు విజయ్ అసెంబ్లీలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం గుర్రపు వేగంతో పని చేస్తోందన్నారు. తమది ప్రభావవంతమైన, స్వచ్ఛమైన ప్రభుత్వం అన్నారు.
మైనారిటీలు, విద్యార్థులు, యువత, మహిళలు, రైతుల హక్కుల కోసం తమ ప్రభుత్వం ఎక్కడా రాజీపడకుండా పనిచేస్తుందని తెలిపారు. లౌకిక విలువలు, సామాజిక న్యాయం, పారదర్శకత, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీవీకే కూటమి ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. టీవీకే అధినేత విజయ్ ఈ నెల 10న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో టీవీకే కూటమి విజయం సాధించింది. ఏఐఏడీంఎకే తిరుగుబాటు నేతలు మద్దతు ఇవ్వడంతో విజయ్ బలం మరింత పెరిగింది.