న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో మహిళలకు ప్రవేశం కల్పించాలని నిర్ణయించినట్టు కేంద్రప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. త్రివిధ దళాల అధిపతులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకొన్నట్టు పేర్కొన్నది. ఎన్డీఏ ద్వారా సాయుధ బలగాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ కూడా కల్పిస్తామని వెల్లడించింది. ఇది ‘చరిత్రాత్మక నిర్ణయం’ అని వ్యాఖ్యానించింది. ఎన్డీఏలో మహిళలకు ప్రవేశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్యర్య భాటి హాజరయ్యారు. కేంద్రం నిర్ణయాలను సుప్రీంకోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించడానికి సమయం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కోర్టు..‘ఇంతకుముందు విచారణలోనే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే మేం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకొన్నందుకు సంతోషంగా ఉంది’ అని వ్యాఖ్యానించింది.
కరోనా మరణాలన్నిటికీ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని చెప్పలేం
న్యూఢిల్లీ: కరోనా సెకండ్వేవ్లో సంభవించిన మరణాలన్నిటికీ నిర్లక్ష్యమే కారణమని న్యాయస్థానాలు భావించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణాలు సంభవించినట్టుగా భావించి పరిహారం ఇప్పించాలని దాఖలైన పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది. సెకండ్ వేవ్లో చాలామంది మరణించారని, అందరూ కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారని చెప్పడం అతి అవుతుందని పేర్కొన్నది.
మహిళలకు అవకాశం గొప్ప విషయం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎన్డీఏలో మహిళలకు అవకాశమివ్వాలని కేంద్రం నిర్ణయించడం గొప్ప విషయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశంసించారు. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఎన్డీఏలో అడ్మిషన్లు ఇస్తారని, యూపీపీఎస్సీ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలు, గురుకులాల ఇంటర్ విద్యార్థినులు ఎన్డీఏలో సీటు సాధించేలా అధ్యాపకులు, ఇంటర్బోర్డు అధికారులు కృషిచేయాలని సూచించారు.