న్యూఢిల్లీ, జూన్13: మహిళలు ఎంత ఎత్తుకు ఎదిగితేనేం.. ఆకాశంలో సగమని కీర్త్తినందుకుంటేనేం.. వివక్ష నుంచి మాత్రం వారు తప్పించుకోలేకపోతున్నారు. వృత్తిగత, వ్యక్తిగత జీవితంలో అడుగడుగునా అది వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. అందుబాటులో ఉన్న తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలోని 90 శాతం మంది మహిళలు వివక్షకు గురవుతున్నారు. ఇది ప్రధానంగా రాజకీయ, విద్య, ఆర్థిక, భౌతిక దాడులు వంటి నాలుగు అంశాల్లో స్పష్టంగా కనిపిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం -2023 లింగ సామాజిక ప్రమాణాల సూచీ చెప్తున్నది.
ప్రజాస్వామ్యంలో రాజకీయంగా స్త్రీ, పురుషులకు సమాన హక్కులున్నప్పటికీ మహిళల కంటే పురుషులే మంచి రాజకీయ నాయకులవుతారని వెల్లడించింది. ఆర్థికపరంగా మహిళలతో పోలిస్తే పురుషులకే ఉద్యోగ హక్కులు ఎక్కువని, మహిళల కంటే పురుషులే మంచి బిజినెస్ ఎగ్జిక్యూటివ్లు కాగలుగుతారని విశ్లేషించింది. మహిళలపై పురుషులు దాడి చేయడం సబబే..అబార్షన్లు సహేతుకమే అన్నది మహిళలు ఎదుర్కొంటున్న మరో వివక్ష అని తెలిపింది.
భారత్లో మరింత ఎక్కువ
ప్రపంచవ్యాప్తంగా 61 శాతం మంది మహిళలు రాజకీయ, 28 శాతం మంది విద్య, 60 శాతం మంది ఆర్థిక, 75 శాతం మంది శారీరక పరమైన వివక్ష ఎదుర్కొంటున్నారు. భారత్లో 99 శాతం మంది మహిళలు పై నాలుగింటిలో కనీసం ఒక వివక్షను ఎదుర్కొంటుండగా, 69 శాతం మంది రాజకీయ, 39 శాతం మంది విద్య, 75 శాతం మంది ఆర్థిక, 92 శాతం మంది భౌతిక రూపురేఖల విషయంలో వివక్షకు గురవుతున్నారు.
నాయకత్వ స్థానాల్లో 10 శాతమే
1995 నుంచి ఇప్పటి వరకు 10 శాతం మంది మహిళలు మాత్రమే దేశాధినేతల స్థానాల్లో ఉన్నారు. సామాజిక నిబంధనలు కూడా మహిళల శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనా వేస్తుండడమే వారిపై పక్షపాత ధోరణి పెరగడానికి మరో కారణం. ఇండియా వంటి దక్షిణాసియా దేశాల్లో మహిళలు ప్రస్తుతం పొందుతున్న దానికంటే మరింత మద్దతు అవసరం. 2021లో భారత్లో మహిళల తలసరి ఆదాయం పురుషులతో పోలిస్తే 21 శాతమే. పక్షపాతం ద్వారా మహిళల అవకాశాలను నియంత్రించడమంటే వారి నుంచి ప్రయోజనాలను సమాజం కోల్పోవడమేనన్నది నిపుణుల వాదన.