న్యూఢిల్లీ, డిసెంబర్ 13: శనివారం జరిగిన సీబీఎస్ఈ పదో తరగతి ఇంగ్లీషు ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఓ ప్యాసేజీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులోని అంశాలు సమాజంలో పురుషులతో పోలిస్తే మహిళలను తక్కువ చేసి చూపేలా, మహిళా సమానత్వాన్ని దెబ్బతీసేలా ఉందని పలు వర్గాలు మండిపడుతున్నాయి. వివాదాస్పదమైన ఆ పేరా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘మహిళలకు స్వాతంత్య్రం ఇవ్వడం వల్ల పిల్లలపై తల్లిదండ్రుల అదుపాజ్ఞలు దెబ్బతింటున్నాయి. భర్త అడుగుజాడల్లో నడవడం వల్లే తల్లి తన పిల్లల విధేయత పొందగలుగుతుంది’ అనేవిధంగా వాక్యాలు ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజీలో ఉన్నాయి. అదేవిధంగా ‘మహిళలు స్వాతంత్య్రం పొందడం అనేక సామాజిక, కుటుంబపరమైన సమస్యలకు ప్రధాన కారణంగా ఉంది. భార్యలు భర్తలకు విధేయత చూపడం మానేస్తే.. అది పిల్లల క్రమశిక్షణా రాహిత్యానికి దారితీస్తుంది’ అని మరో పార్ట్లో ఉన్నది.
క్షమాపణలు చెప్పాలి: సోనియా
ఈ అంశం పార్లమెంట్ను కూడా కుదిపేసింది. ప్రధాని మోదీతో పాటు సీబీఎస్ఈ మహిళా లోకానికి తక్షణం క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లోక్సభలో డిమాండ్ చేశారు. ఈ అంశంపై లోక్సభలో కాంగ్రెస్తో పాటు డీఎంకే, ఐయూఎంఎల్, ఎన్సీపీ, ఎన్సీ పార్టీలకు చెందిన ఎంపీలు వాకౌట్ చేశారు. మరోవైపు ఢిల్లీ మహిళా కమిషన్ సీబీఎస్ఈకి నోటీసులు జారీచేసింది.
తలొగ్గిన సీబీఎస్ఈ
ప్రశ్నాపత్రంపై వస్తున్న విమర్శలకు సీబీఎస్ఈ తలొగ్గింది. ఈ ప్యాసేజీ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని పేర్కొంటూ.. ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నది. ఆ ప్రశ్నలకు సంబంధించి విద్యార్థులకు మార్కులు కేటాయిస్తామని, ప్రశ్నాపత్రం రూపకల్పన ప్రాసెస్పై కమిటీ ఏర్పాటు చేసి సమీక్ష చేస్తామని తెలిపింది.