న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: మసీదుల్లో నమాజ్ చేసుకొనేందుకు మహిళల ప్రవేశానికి అనుమతి ఉన్నదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇస్లాం మత గ్రంథాలు, సిద్ధాంతాలు, విశ్వాసాలు ఇదే చెబుతున్నాయని, ప్రార్థనల కోసం ఒక ముస్లిం మహిళ స్వేచ్ఛగా మసీదులోకి ప్రవేశించవచ్చని, నమాజ్ కోసం మసీదులో ఉన్న సదుపాయాలను వినియోగించుకొనేందుకు ఆమెకు హక్కు ఉన్నదని పేర్కొన్నది. ఈ మేరకు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు బుధవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.
ఇదే సమయంలో నమాజ్ కోసం ఏ మసీదులోనైనా పురుషులు, స్త్రీలు ఒకేస్థలంలో స్వేచ్ఛగా మిళితం అవడాన్ని ముస్లిం మత గ్రంథాలేవీ చెప్పడం లేదని పేర్కొన్నది. మదీనా మసీదులో కూడా పురుషులు, స్త్రీలకు వేర్వేరు స్థలం ఉంటుందని, బారికేడ్లు ఏర్పాటు చేస్తారని తెలిపింది. షేక్ ఫర్హా అన్వర్ హుస్సేన్ అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానంలో 2020లో ఓ పిటిషన్ వేశారు. భారత్లోని మసీదుల్లో మహిళల ప్రవేశంపై నిషేధం ఉన్నదని, ఇది రాజ్యాంగ, చట్ట విరుద్ధమైనదిగా ఆదేశించాలని కోరారు.