లక్నో: ఒక మహిళకు మరో వ్యక్తితో సంబంధంపై ఆమె మాజీ ప్రియుడు అసూయ చెందాడు. ఆ మహిళను హత్య చేసేందుకు ఆమె ఇంటికి వచ్చాడు. అయితే పెనుగులాటలో ఆమె కుమార్తెను కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటనలో ఆ మహిళ అల్లుడికి కూడా గాయాలయ్యాయి. (Ghaziabad Woman) ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇందిరాపురం ప్రాంతానికి చెందిన చంపా దేవి మొదటి భర్త చనిపోగా, వికలాంగుడైన రెండో భర్త బీహార్లో నివసిస్తున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న బాబీ జైలుకెళ్లాడు.
కాగా, 15 రోజుల కిందట బాబీ జైలు నుంచి విడుదలయ్యాడు. చంపా దేవికి అజయ్ అనే వ్యక్తితో సంబంధం ఉండటం తెలిసి అతడు అసూయ చెందాడు. అజయ్కు ఫోన్ చేసి బెదిరించాడు. మరో వ్యక్తితో కలిసి మంగళవారం ఆమె ఇంటికి వెళ్లాడు. చంపాదేవిపై బాబీ కత్తితో దాడి చేయబోగా ఆమె కుమార్తె అయిన 18 ఏళ్ల జ్యోతి, అల్లుడు లలితేష్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జ్యోతి కత్తి పోట్లకు గురికాగా, ఆమె భర్తకు కూడా గాయాలయ్యాయి.
మరోవైపు ఇంటి నుంచి బయటకు పరుగుతీసిన చంపా దేవి సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఈ విషయం చెప్పింది. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులు బాబీని అరెస్ట్ చేశారు. జ్యోతిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న బాబీతో పాటు వచ్చిన మరో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. ఆరు నెలల కిందట పెళ్లైన జ్యోతి, క్యాన్సర్ రోగి అయిన తల్లి చంపా దేవికి సపర్యలు చేసేందుకు భర్తతో కలిసి పుట్టింటికి వచ్చిందని పోలీసులు తెలిపారు.