బెంగళూరు: రైల్వే వంతెన సమీపంలో ట్రావెల్ బ్యాగ్లో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. (Woman’s Body In Suitcase) పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని సూట్కేస్లో కుక్కి కదులతున్న రైలు నుంచి బయటకు విసిరేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం హోసూర్ ప్రధాన రహదారిలోని పాత చందాపుర రైల్వే బ్రిడ్జి సమీపంలో, రైలు పట్టాల దగ్గర నీలం రంగులో ఉన్న ట్రావెల్ సూట్కేస్ పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అందులో యువతి మృతదేహం ఉండటంతో షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రావెల్ బ్యాగ్లోని యువతి మృతదేహాన్ని పరిశీలించారు. హతురాలి వయసు 18 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. ఆమెను ఎక్కడో హత్య చేసి సూట్కేసులో మృతదేహాన్ని కుక్కి కదులుతున్న రైలు నుంచి విసిరేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో రైల్వే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్లు పోలీస్ అధికారి తెలిపారు. తమ ప్రాంతం పరిధిలో మృతదేహం లభించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. యువతి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించినట్లు వివరించారు.