ముంబై: సముద్రంలో మునిగిపోతున్న ఒక మహిళను తీర ప్రాంత పోలీసులు కాపాడారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో ఒక బోటులో టూరిస్ట్లు ప్రయాణిస్తుండగా సముద్ర ప్రవాహం తాకిడికి అది కుదుపులకు గురైంది. దీంతో పట్టుతప్పిన ఒక మహిళ సముద్రంలో పడిపోయింది. ఈత రాక నీటిలో మునిగిపోతూ ఇబ్బంది పడింది.
సమాచారం అందుకున్న కోస్టల్ పోలీస్, కొలాబా పోలీస్ బృందం ఆ మహిళను రక్షించేందుకు రంగంలోకి దిగారు. లైఫ్ జాకెట్ ఆసరాతో ఉన్న ఆమె వద్దకు ఇద్దరు గజ ఈత గాళ్లు చేరి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించారు. ఇంతలో కోస్టల్ పోలీస్, కొలాబా పోలీస్ బృందం ఒక బోటులో ఆ మహిళ సమీపానికి చేరుకున్నది. అనంతరం తాడు సహాయంతో ఆమెను బోటుపైకి చేర్చి కాపాడారు. కాగా, ఈ వీడియోను ముంబై పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది.