Lover Murder | ముంబై : హోటల్ గదిలో ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపాడు ప్రియుడు. ఈ ఘటన మహారాష్ట్ర పుణెలోని ఓయో టౌన్ హౌస్ హోటల్లో శనివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ వద్దకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రిషబ్ నిగమ్ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మృతురాలిని వందన ద్వివేదిగా గుర్తించారు. పుణెలోని హింజవాడిలోని ఓ ఐటీ సంస్థలో వందన సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. రిషబ్ యూపీ రాజధాని లక్నోకు చెందినవాడు. వీరిద్దరూ గత పదేండ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. వందనను కలిసేందుకు రిషబ్ జనవరి 25న పుణెకు వచ్చాడు. ఇద్దరూ కలిసి హింజవాడిలోని ఓయో టౌన్ హౌస్ హోటల్లో రూమ్ను బుక్ను చేసుకున్నారు.
అయితే వందనను చంపేందుకు పక్కా ప్రణాళికతో రిషబ్ లక్నో నుంచి పుణె వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వందన ప్రవర్తనపై రిషబ్ అనుమానం పెంచుకున్నట్లు పేర్కొన్నారు. ఇక వందనను చంపిన అనంతరం శనివారం రాత్రి 10 గంటలకు హోటల్ నుంచి రిషబ్ వెళ్లిపోయినట్లు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.