ఇంఫాల్, జూలై 6: మణిపూర్లోని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఓ పాఠశాల వద్ద జరిగిన కాల్పుల్లో మహిళ మృతిచెందడం కలకలం రేపింది. క్వాకెతెల్ మయాయి కొయిబిలోని శిశు నిస్థా నికేతన్ పాఠశాల వద్ద గుర్తుతెలియని మిలిటెంట్ జరిపిన కాల్పుల్లో ఓ మహిళ దుర్మరణం పాలైంది. ఈ ఘటనపై ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం (ఐటీఎల్ఎఫ్) మండిపడింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది. కాంగ్పోక్పి జిల్లాలోని ఓ గ్రామంలో ఆటోమేటిక్ గన్తో ఓ సాయుధుడు గ్రామస్థులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అస్సాం రైఫిల్స్ బలగాలు గ్రామానికి చేరుకొని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చాయి.
చురాచాంద్పుర్ జిల్లాలో సుమారు 4 వేల మంది కుకీలు ప్రత్యేక పరిపాలనను కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో గురువారం జరిగిన హోం శాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం నుంచి టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరిక్ ఓబ్రియన్, కాంగ్రెస్ సభ్యులు దిగ్విజయ్ సింగ్, ప్రదీప్ భట్టాచార్య వాకౌట్ చేశారు. మణిపూర్ అంశంపై సమావేశంలో చర్చించాలని కోరుతూ తొలుత వీరు కమిటీ చైర్మన్కు వినతి పత్రాన్ని అందజేశారు. కానీ సమావేశం ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చకపోవడంతో విపక్ష సభ్యులు మీటింగ్ను బహిష్కరించారు.