లక్నో: ఒక మహిళ నిద్రిస్తున్న కోడలిని గన్తో కాల్చి చంపింది (Woman shoots dead daughter-in-law). ఆ తర్వాత దోపిడీ దొంగల పనిగా నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం తెలిసింది. దీంతో అత్తతోపాటు ఆమె భర్త, కుమారుడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం రాత్రి కేవలం కోడలు, అత్త మాత్రమే ఇంట్లో ఉన్నారు. అయితే ఇంటి పనులు చేయని కోడలిపై అత్త ఆగ్రహం వ్యక్తం చేసింది. నిద్రిస్తున్న ఆమె తలపై తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేసింది. రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలో రివాల్వర్ను పడేసింది. దొంగలు దోపిడీకి ప్రయత్నించారని, అడ్డుకోబోయిన కోడలిని గన్తో కాల్చి చంపినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. ఇల్లంతా చిందరవందర చేసింది.
కాగా, ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కట్నం, కులం వంటి విషయాల్లో కోడలు, అత్త మధ్య తరచుగా పోట్లాట జరుగుతున్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కోడలిని అత్త చంపినట్లు గ్రహించారు. డ్రైనేజీలో పడేసిన రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. అత్త, మామతోపాటు మృతురాలి భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.