చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాలకు స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నైలోని టీపీ చట్రం ఏరియాలోని ఓ శ్మశాన వాటికలో ఉదయ్ కుమార్ అనే యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. అతని శరీరంలో కదలికలను గమనించిన మహిళా సీఐ రాజేశ్వరి.. తక్షణమే ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.
శ్మశాన వాటిక నుంచి ఆటో వరకు సీఐ రాజేశ్వరి.. ఉదయ్ కుమార్ను తన భుజాలపై మోసుకెళ్లారు. ఆ తర్వాత ఆటోలో ఉదయ్ను ఉంచి ఆస్పత్రికి పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. యువకుడి ప్రాణాలను కాపాడిన సీఐ రాజేశ్వరిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.