న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై తాగిన మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన తెలిసిందే. అయితే ఆ కేసులో అరెస్టు అయిన వెల్స్ ఫార్గో ఉద్యోగిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ సమయంలో అతను ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. సదరు మహిళ తన సీటులో తానే మూత్ర విసర్జన చేసుకున్నట్లు అతను ఢిల్లీ కోర్టులో చెప్పాడు. ఆ మహిళ సీటులో తాను మూత్రం పోయలేదన్నాడు.
గత ఏడాది నవంబర్ 22వ తేదీన అమెరికా నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. అయితే ఎయిర్ ఇండియా సంస్థ ఆ వ్యక్తిపై 30 రోజుల నిషేధాన్ని విధించింది. నిజానికి ఆ వ్యక్తిపై చర్యను తీసుకోవాలని విమానంలోని క్యాబిన్ సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోలేదని మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. టాటా సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్కు కూడా ఆమె లేఖ రాశారు. ఆ తర్వాతే ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టారు.