Online Fraud | భారతీయులను సైబర్ మోసగాళ్లు తెలివిగా బురిడి కొట్టించి, రూ.లక్షల్లో మాయం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ మోసాల్లో వేలాది మంది రూ.లక్షల్లో కోల్పోతున్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ కొరియర్ డెలివరీ స్కామ్లో చిక్కుకుని రూ.1.38 లక్షల నగదు నష్టపోయారు.
మితిక్షా సేథ్ (25) అనే ఫ్యాషన్ డిజైనర్.. దర్జీకి ఇచ్చిన బట్టల పార్సిల్ కోసం వేచి చూస్తున్నారు. ఆర్డర్ పూర్తయిన తర్వాత సంబంధిత టైలర్.. మితిక్షా సేథ్ కు ఫోన్ చేసి ఆర్డర్ పూర్తయిందని, కొరియర్ లో పంపుతానని చెప్పాడు. అలా కాల్ వచ్చిన రెండు మూడు రోజుల తర్వాత ఒక పార్సిల్ వచ్చింది. టైలర్ పంపిన కొరియర్ డిటైల్స్.. గూగుల్లో ట్రాక్ చేశారు.
కొన్ని నిమిషాల తర్వాత వెబ్ సైట్ లో పార్సిల్ ప్రత్యక్షమైంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి.. కొరియర్ బాయ్ నంటూ బాధితురాలికి ఫోన్ చేసి, పార్సిల్ అందుకోవాలంటే రూ.5 చెల్లించాలని చెప్పాడు. మనీ పే చేయడానికి లింక్ షేర్ చేశాడు. తొలుత రూ.5, మళ్లీ రూ.5 పే చేయాలని కోరాడు. రెండో ట్రాన్సాక్షన్ తర్వాత తన బ్యాంక్ అకౌంట్ డీయాక్టివేట్ అయిందని, దీంతో ఆన్ లైన్ మోసానికి గురైనట్లు అనుమానించానని బాధితురాలు తెలిపారు. గత మే 13-21 మధ్య టూర్ లో ఉన్నానని, సెల్ ఫోన్ వాడలేదని చెప్పారు.
కొన్ని రోజుల తర్వాత బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుంటే తక్కువ బ్యాలెన్స్ ఉందని తేలింది. తన స్నేహితురాలి వద్ద నుంచి మనీ పంపడానికి ప్రయత్నించినా.. సరిపడా బ్యాలెన్స్ లేదని తెలుసుకున్నానని చెప్పారు. ఆ మరునాడే బ్యాంకు శాఖకు వెళితే రూ.1.38 లక్షలు తన ఖాతా నుంచి డెబిట్ అయినట్లు స్టేట్ మెంట్ చూపిస్తున్నది. గత మే 12, 13 తేదీల్లో లావాదేవీలు జరిపినట్లు రికార్డులు చెబుతున్నాయి. వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి ఫిర్యాదుచేశారు.