న్యూఢిల్లీ: అప్పుల వివాదం నేపథ్యంలో కొందరు వ్యక్తులు ఒక మహిళను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని శ్మశానవాటికలో ఖననం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 54 ఏళ్ల మీనా వాధ్వన్ రోజువారీ కూలీలు, కార్మికులకు అప్పులు ఇచ్చేది. ఈ నెల 2న బయటకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీనా నుంచి అప్పులు తీసుకుని సరిగా చెల్లించకుండా ఆమెతో గొడవ పడిన మెబిన్ ఖాన్పై వారు అనుమానం వ్యక్తం చేశారు.
కాగా, ఫిర్యాదు అందుకున్న పోలీసులు మీనా కోసం తీవ్రంగా వెతికారు. ఫలితం లేకపోవడంతో మెబిన్ ఖాన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్మశానవాటికలో పూడ్చిపెట్టిన ఆ మహిళ మృతదేహాన్ని బుధవారం వెలికితీశారు. పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు మీనా నుంచి రుణం తీసుకుని ఆమె హత్యకు సహకరించిన రెహాన్, నవీన్ అనే ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నిందితుల నుంచి రూ.5,000 లంచం తీసుకుని మహిళ వివరాలు రిజిస్టర్ చేయకుండా శ్మశానవాటికలో ఖననం చేసిన అక్కడి వ్యక్తిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు.