న్యూఢిల్లీ: బాలికను ఒక మహిళ ప్రలోభపెట్టింది. టీ అమ్మే వ్యక్తి వద్దకు ఆమెను పంపింది. దీంతో అతడితోపాటు అక్కడ పని చేసే ముగ్గురు బాలురు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. (Girl raped by four) బాధితురాలి ఫిర్యాదుతో ఆ మహిళతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. సదర్ బజార్ ప్రాంతంలో ఒక వ్యక్తి టీ స్టాల్ నడుపుతున్నాడు. చెత్త ఏరుకునే ఒక మహిళ ప్రతి రోజు టీ కోసం అక్కడకు వెళ్లేది. అయితే ఎంజాయ్ చేసేందుకు ఒక అమ్మాయిని ఏర్పాటు చేయాలని జనవరి 1న టీ షాపు యజమాని ఆ మహిళను అడిగాడు. దీని కోసం కొంత డబ్బు కూడా ఇచ్చాడు. అలాగే షాపు భవనంపై టార్పాలిన్తో తాత్కాలిక షెల్టర్ కూడా నిర్మించాడు.
కాగా, మరునాడు ఆ ప్రాంతంలో చెత్త ఏరుకునే 12 ఏళ్ల బాలికతో ఆ మహిళ పరిచయం పెంచుకుంది. మార్కెట్ వద్ద ఒక భవనంపై చాలా చెత్త ఉందని, వెళ్లి తీసుకోవాలని ఆమెను ప్రలోభపెట్టి పంపింది. అక్కడకు చేరుకున్న బాలికపై టీ షాపు యజమానితోపాటు అతడి వద్ద పని చేసే 12,14, 15 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామని ఆమెను బెదిరించారు.
మరోవైపు వాయువ్య ఢిల్లీలోని ఇంటికి చేరుకున్న బాధిత బాలిక రెండు రోజుల పాటు మౌనంగా ఉంది. జనవరి 5న చెత్త ఏరుకునేందుకు సదర్ బజార్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ తన బంధువైన యువతిని కలిసి జరిగిన దారుణం గురించి చెప్పింది. ఆ యువతి తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్కు చెందిన టీ షాపు యజమానితోపాటు అతడి వద్ద పని చేసే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురు మైనర్ బాలురు, బాలికను ప్రలోభానికి గురి చేసి పంపిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.