చండీగఢ్: ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను హత్య చేసింది. ఆ తర్వాత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ ఇంటికి వచ్చిన బంధువు వారి మృతదేహాలను చూసి షాక్ అయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేస్తున్నారు. (Woman Kills 3 Children, Suicide) పంజాబ్లోని మాన్సాలో ఈ సంఘటన జరిగింది. గురువారం సాయంత్రం మాన్సాలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న 36 ఏళ్ల సందీప్ కౌర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి ముందు ముగ్గురు పిల్లలను ఆమె చంపింది. 12 ఏళ్ల పెద్ద కుమార్తె ఖుష్ప్రీత్కు విషమిచ్చింది. 7 ఏళ్ల రెండో కుమార్తె సమన్దీప్ కౌర్, రెండేళ్ల కుమారుడి గొంతునొక్కి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
కాగా, గురువారం సాయంత్రం బంధువైన వ్యక్తి ఆ ఇంటికి వచ్చాడు. సందీప్ కౌర్ ఉరికి వేలాడటం, ఆమె ముగ్గురు పిల్లలు నేలపై విగతజీవులుగా పడి ఉండటం చూసి షాకయ్యాడు. స్థానికులను అలెర్ట్ చేయడంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. నలుగురి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు.
మరోవైపు భర్త మరణించడంతో కౌర్ రెండో పెళ్లి చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. మొదటి భర్త ద్వారా ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నట్లు చెప్పారు. వారిది హత్యా, లేక ఆత్మహత్యా అన్నది పోస్ట్మార్టం రిపోర్ట్ తర్వాత తెలుస్తుందని అన్నారు.