ముంబై: ఒక మహిళ తన ఇద్దరు పిల్లల్ని చంపింది. ఆ తర్వాత బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. (Woman Jumps To Death) తాను తీసుకున్న ఈ నిర్ణయానికి భర్త చిత్రహింసలు, వేధింపులు కారణమని సూసైడ్ నోట్లో ఆరోపించింది. మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో కోణార్క్ నగర్ ప్రాంతంలోని హరి వందన్ అపార్ట్మెంట్ టెర్రస్పై నుంచి 30 ఏళ్ల అశ్విని కిందకు దూకింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించింది.
కాగా, స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అశ్విని ఇంటిని పరిశీలించగా పిల్లలైన 8 ఏళ్ల ఆరాధ్య, రెండేళ్ల అగస్త్య శవమై కనిపించారు. ఆ మహిళ తన పిల్లలకు విషం ఇచ్చి చంపి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఆమె అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
మరోవైపు భర్త స్వప్నిల్ తనను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఆరోపిస్తూ అశ్విని రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆత్మహత్యకు ముందు భర్తపై పలు ఆరోపణలు చేస్తూ అశ్విని రికార్డ్ చేసిన వీడియో సందేశాన్ని బంధువులకు ఆమె షేర్ చేసినట్లు తెలుసుకున్నారు. పని నిమిత్తం పూణేలో ఉన్న అశ్విని భర్త స్వప్నిల్ను విచారణ కోసం నాసిక్కు రప్పిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.